రాజ్యసభ బరిలో వర్ల రామయ్య.. చంద్రబాబు ప్లాన్ ఇదేనా?

  • Publish Date - March 10, 2020 / 03:37 PM IST

టీడీపీ హయాంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి  నిలపుతున్నట్లుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్లే నలుగురు అభ్యర్థులు ఎవరెవరు అనే విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చేయగా.. ఇప్పుడు టీడీపీ తరపున వర్ల రామయ్యను నిలుపుతున్నారు. 

అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేంత బలం లేదు. అవకాశం కూడా తక్కువే అయితే పార్టీ తరపున అభ్యర్థిని నిలపడానికి మాత్రం కారణం ఉందంటున్నారు నాయకులు. టీడీపీ ఎమ్మెల్యేలందరికి విప్ జారీ చేసి.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఏజెంట్‌కి చూపించి ఓటు వేసేలా చూడాలనేదే చంద్రబాబు ప్లాన్. 

ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు దూరంగా ఉండగా.. వాళ్లపై వేటు వెయ్యడానికే ఈ ప్లాన్ అని స్పష్టం అవుతుంది.