టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడింది. సభ్యులుగా ఎన్నికైనవారు ప్రమాణస్వీకారాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో మండలి సభ్యులంతా తొలిసారిగా సమావేశంకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23)న అన్నమయ్య భవన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ దర్శకర్తల మండలి తొలి సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో 175 కీలక అంశాలపై టీటీడీ బోర్డ్ చర్చించనుంది. వీటిలో ముఖ్యమైన కార్యక్రమాలకు ఆమోదం తెలుపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8వరకూ కొనసాగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పాలక మండలి సభ్యులు చర్చించనున్నారు. అనంతరం ముడి సరుకుల కొనుగోళ్లుపై కూలకషంగా చర్చించి నిధుల కేటాయింపులు..తిరుమలలో భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల కొనుగోలు..అర్చకుల పదవీ విరమణ..వంటి కీలక అంశాలపై సభ్యులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఏపీ రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మాణం నిధులు కుదింపు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలు,రూ.79 కోట్లతో తిరుమలలో యాత్రీకుల వసతి సముదాయానికి రూ.100 కోట్లతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలుపనున్నట్లుగా సమాచారం. తిరుపతిలో గరువ వారధి నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు కేటాయింపులకు కూడా బోర్డు ఆమోదం తెలుపనుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వంటి పలు కీలక అంశాలపై బోర్డు చర్చించి నిర్ణయం తీసుకోనుంది.