ఢిల్లీ : తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు బాల శౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కోరారు. ఆంధ్రాబ్యాంకును విలీనం చేయడమంటే తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీయటమేనని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి, ఆర్ధిక మంత్రికి లేఖ రాశారు.
స్వాతంత్ర్యం రాక మునుపే 96 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్యోద్యమ నేత భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారన్నారు. ఇంతటి ప్రాచీన చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకుతో కలపవద్దని లేఖలో విన్నవించారు. తెలుగు ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై నిర్మలా సీతారామన్ మరోసారి ఆలోచించాలని కోరారు.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రా బ్యాంకును విలీనం చేయాల్సి వస్తే.. యూనియన్ బ్యాంకునే ఆంధ్రా బ్యాంకులో విలీనం చేసి ‘ఆంధ్రా బ్యాంకు’గానే పేరు కొనసాగించాలని బాలశౌరి ప్రతిపాదించారు. అంతేకాక ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే ఈ అంశంపై ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీని కలుస్తానన్నని బాలశౌరి అన్నారు.