అప్పుడే 40 డిగ్రీలు : ఈ వేసవిలో భగభగలే

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి.

  • Publish Date - February 23, 2019 / 02:33 AM IST

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. వాతావరణం కొంత కూల్‌గా ఉండాల్సిన ఈ సమయంలో అనూహ్యంగా 40 డిగ్రీల చేరువకు ఉష్ణోగ్రతలు పరుగులు తీస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నుంచే సమ్మర్ సెగలు మొదలు కావడం జనాల్ లోఆందోళన నింపింది.

మండుటెండలు, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. ఈసారి సమ్మర్ చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 3 వారం నుంచి మే చివరి వారం వరకు వాయవ్య దిశ నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ప్రతాపం చూపిస్తుండటం ముందు ముందు వేసవి తీవ్రత ఎలా ఉండనుందో తెలియజేస్తోంది. శుక్రవారం(ఫిబ్రవరి-22-2019) నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం మొదలయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లో 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఫిబ్రవరి 3వ వారంలోనే ఏప్రిల్ ఆఖరి నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం(ఫిబ్రవరి 22) ఏపీ రాష్ట్రంలోకెల్లా కర్నూలులో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు అధికం. కాకినాడలో 36 డిగ్రీలు రికార్డ్ అయ్యింది. ఇది సాధారణం కంటే 4.2 డిగ్రీలు ఎక్కువ.

ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 వారం నుంచి మే చివరి వరకు పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. రామగుండం, భద్రాచలంతోపాటు మైనింగ్‌  ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ గరిష్టంగా 44 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమాచారం. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు