Minister Anilkumar: కేసీఆర్కు ఏపీ మంత్రి అనిల్ కుమార్ కౌంటర్ !
టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన కామెంట్లపై.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కావాలంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని.. తమకు అభ్యంతరం లేదని అన్నారు.
Minister Anilkumar: ఏపీలో కరెంటు కోతలున్నాయ్.. తెలంగాణలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయ్.. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారంటూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కేసీఆర్ అన్నట్టుగా.. ఏపీలో కరెంటు కోతలు లేవని స్పష్టం చేశారు. బొగ్గు సమస్య ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదన్నారు.
తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోనే సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు అవుతున్నట్టు మంత్రి అనిల్ తేల్చి చెప్పారు. తెలంగాణలో అమల్లో ఉన్న పథకాలను ఏపీలో అమలు చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఎన్నికల స్టంట్ లో భాగంగానే.. కేసీఆర్ అలా టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడి ఉండవచ్చని మంత్రి అనిల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దళిత బంధు పథకంపైనా.. అనిల్ స్పందించారు. తెలంగాణలో ఇప్పటివరకూ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పథకాన్ని అమలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకం అమలులో లేదని ఆయన చెప్పారు. ఇక.. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారని.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి అనిల్ స్పందించారు. కావాలనుకుంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. తమకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ఇక.. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఇవాళ నిర్వహించి టీఆర్ఎస్ ప్లీనరీలో.. పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఏపీకి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోతే.. కొత్త రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటాయని ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని.. తెలంగాణ పథకాలనే ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలోనే.. స్పందించిన మంత్రి అనిల్.. ఏపీలోనే పథకాలు ఎక్కువగా అమలవుతున్నాయని తేల్చి చెప్పారు.
Read More:
CM KCR: తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. ఏపీలో కోతలు ఉన్నాయి
CM KCR Speech: ఆంధ్రాలో పార్టీ పెట్టమని వేల మంది విజ్ఞప్తి చేస్తున్నారు