Oil Palm Farming : ఆయిల్ పామ్ తోటల్లో మేలైన యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు
ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసునుబట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : March 24, 2023 / 11:09 AM IST
Oil Palm Farming
Oil Palm Farming : ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ గర్వకారణంగా వుంది. 2014 నుంచి ఆయిల్ పామ్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్న రైతు… రెండేళ్లుగా పెరిగిన ధరలతో కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంటకు మధ్య దళారుల బెడద లేకపోవటంతో స్ధిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు రాయసీమలోని అనంతపురంలోను, తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోను ఈ తోట పంట విస్తరించి వుంది. పంట విస్తరణకు ప్రభుత్వ రాయితీలు కూడా తోడవటంతో సాగులో రైతు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ తోట పంటకు మంచి యాజమాన్య పద్ధతులు కూడా తోడైతే ఎకరాకు 15టన్నుల దిగుబడిని పొందే వీలుందని ఉద్యాన శాఖ తెలియజేస్తోంది. ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి దోహదపడే మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోస్తాజిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తున్న తోటపంట ఆయిల్ పామ్. నూనెగింజల్లో అత్యధిక రకవరీ కలిగిన ఏకైక పంటగా ఆయిల్ పామ్ పెరుగాంచింది.నీరు నిల్వ వుండని సారవంతమైన నల్లగరపనేలలు, ఎర్రనేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం. అయితే నీటివసతి వున్న ప్రాంతాల్లో ఇసుకభూముల్లో కూడా రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. సాధారణంగా త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు వచ్చే విధంగా రైతులు నాటుతున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ తోటల్లో, మొక్క నాటిన దగ్గర నుండి, రైతులు యాజమాన్యంపై తగిన శ్రద్ద పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
READ ALSO : Oil Farm Cultivation : వంట నూనెలకు పెరుగుతున్న డిమాండ్ నేపధ్యంలో ఆయిల్ ఫామ్ సాగు దిశగా అన్నదాతలు!
ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసునుబట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో ముఖ్యంగా సూక్ష్మపోషకధాతు లోపాలు తలెత్తకుండా బోరాన్ మెగ్నీషియంను సంవత్సరానికి రెండు, మూడు దఫాలుగా తప్పనిసరిగా అందించాలి. వీటిని ఇతర ఎరువులతో కలపకుండా ప్రత్యేకంగా వేయాలి.
మొదటి 2 సంవత్సరాలు తోటల నుండి దిగుబడి వుండదు. వేరు వ్యవస్థ పెద్దగా విస్తరించదు కనుక, మొక్కల మధ్య ఖాళీస్థలంలో అంతరపంటలు సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. దీనివల్ల కలుపు కూడా సమర్ధంగా అరికట్టబడుతుంది. 3 వ సం. నుండి చెట్లు అధిక కొమ్మలతో విస్తరిస్తాయి కనుక, చెట్ల మధ్య నీడ ఎక్కువ వుండి కలుపు వుండదు. ఈ దశలోపాక్షిక నీడను ఇష్టపడే కోకో పంటను అంతరపంటగా సాగుచేస్తే ఆయిల్ పామ్ తోపాటు అదనపు ఆదాయం పొందవచ్చు. తోటల్లో నరికిన ఆకులను చెట్ల మధ్య మల్చింగ్ చేసినట్లయితే ఇవి కుళ్లి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడటంతోపాటు, భూమిలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు.
READ ALSO : Telangana Cabinet: ఆయిల్ ఫామ్ సాగు.. పంటవేస్తే ఎకరాకు రూ.26 వేలు!
ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే, చెట్ల వయసు పెరిగే కొద్దీ దిగుబడి వృద్ధి గణనీయంగా వుంటుంది. నాటిన 7,8 సంవత్సరాలనుండి ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధించవచ్చు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియోపై క్లిక్ చేయండి.
