Green Chilli Cultivation : ఏడాది పొడవునా సాగులో వుండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీకాలాల్లో నాటితే, పచ్చిమిరపను అన్నికాలాల్లోను సాగుచేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటువల్ల రైతులు ఎకరాకు 12 నుండి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. పచ్చి మిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం, చీడపీడలను అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Betel Leaves Cultivation : కొబ్బరిలో అంతర పంటగా తమలపాకు సాగు.. లాభాలు బాగు
వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పైరు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండు మిర్చి పంట 2 నుండి 5 కోతల్లో పూర్తవుతుండగా, పచ్చి మిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు, మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి, మిగతా పంటను ఎండు మిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం.
పచ్చిమిరప సాగు యాజమాన్యం :
పచ్చిమిరపలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటుచేసి పాలీమల్చింగ్ ద్వారా, సాగుచేసి, మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుండి 280 రోజుల వరకు కొనసాగి, రైతులు మంచి సాధించే అవకాశం ఏర్పడుతోంది.
పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయ కోతలు జరపాల్సి వుంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి మూడు కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, తర్వాత ప్రతి కోతలో 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు.
ప్రస్థుతం రైతులు ఎకరాకు 12 నుండి 18 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు. పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా వున్నా, కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా వుంటాయి. మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయకోతకు కూలీల అవసరం అధికంగానే వుంటుంది. కనుక, చాలామంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి 3 ఎకరాల వరకు సాగుచేస్తున్నారు. పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా వుంటుంది. రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డా. పి. వెంకటరావు .
సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తుంది. ఇటు చీడపీడల బెడద ఎక్కువ . ప్రధానంగా రసంపీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం వుంది. ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త.
Read Also : Banana Cultivation : అరటిసాగులో రకాలు, పిలకల ఎంపిక.. మొక్కల నాటులో సమగ్ర యాజమాన్యం