Inter Crop Cultivation : ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు.. ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగన పెట్టుబడులు మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం ఇటు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదు. దీంతో మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని పండ్ల తోటల సాగును చేపడుతున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు . అక్కడితో ఆగకుండా అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది అంతర పంటగా బంతిపూల సాగుచేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బొప్పాయి తోటను చూడండీ.. మొత్తం 6 ఎకరాలు. 2022 డిసెంబర్ లో 2 ఎకరాల్లో నాటగా.. మరో 4 ఎకరాల్లో 2023 నవంబర్ లో నాటారు. 2022 లో నాటిన 2 ఎకరాల తోట నుండి దిగుబడులు కోస్తుండగా.. గత ఏడాది నాటిన బోప్పాయిలో అంతర పంటగా బంతిని సాగుచేస్తున్నారు నిజామాబాద్ జిల్లా, ఆలూరు మండల కేంద్రానికి చెందిన రైతు జల్లాపూరం అశోక్ రెడ్డి. రైతు అశోక్ రెడ్డి అందరిలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పసుపు, సోయాబీ లాంటి సంప్రదాయ వ్యవసాయం చేసేవారు.
Read Also : Green Gram Cultivation : వేసవి పెసరసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం
అయితే పెరుగుతున్న పెట్టుబడులకుతోడు, దిగుబడులు తగ్గడం.. మార్కెట్ లో కూడా సరైన మద్ధతు ధర లభించకపోవడంతో.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇందుటో భాగంగానే 6 ఏళ్లుగా ప్రణాళిక బద్ధంగా బొప్పాయిని పండిస్తున్నారు. ఈ సారి మహారాష్ట్రకు చెందిన కో -15 బొప్పాయి రకాన్ని 6 ఎకరాల్లో విడుతల వారిగా నాటారు. ముందుగా నాటిన 2 ఎకరా బొప్పాయి నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. నాటిన 3వ నెల నుండి పూత వచ్చింది. 7 వ నెలనుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి.
అంతర పంటగా బంతి సాగు :
వచ్చిన దిగుబడిని డిల్లీ, బొంబాయి లాంట ప్రాంతాలనుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరో 4 ఎకరాల్లో బొప్పాయిలో ఎకరంలో అశోక రకం బంతి పూల సాగును చేపట్టారు. పూలదిగుబడి కూడా వస్తుండటంతో రైతు ఒకే భూమిలో రెండు పంటలపై అధిక లాభాలు పొందుతున్నారు. ఈ రైతు సాగు విధానానికి చుట్టు ప్రక్క గ్రామాల రైతులు ఆకర్షితులవుతున్నారు. తోటవద్దకు వచ్చి సాగు మెళకువలు.. మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో సంప్రదాయ పంటల స్థానంలో పండ్లతోటలను సాగుచేస్తామని చెబుతున్నారు.
సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… రైతు అశోక్ రెడ్డి ఆదాయం పెంచుకునే దిశగా… అడుగులు వేశారు. ఇప్పటికే 2 ఎకరాల్లో వేసిన బొప్పాయి పంటనుండి దాదాపు 110 టన్నుల దిగుబడిని తీశారు. మరో 30 టన్నలు దిగుబడులు చేనుపైనే ఉంది. మార్కెట్ లో సరాసరి 15 వేలకు అమ్మగా రూ. 16 లక్షల 50 వేల ఆదాయం వచ్చింది. అంటే మరో 30 టన్నులకు 5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అంటే రెండెకరాలపై 20 లక్షల ఆదాయం. పెట్టుబడి రూ. రెండున్నర లక్షలు పోగా దాదాపు 17 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. అలాగే 2023 నవంబర్ లో ఎకరం బొప్పాయిలో అంతర పంటగా బంతిని సాగుచేశారు . ఇప్పటికే 6 కోతలు కోయగా 40 క్వింటాళ్ల దిగుబడిని తీశారు. మార్కెట్ లో సరాసరి క్వింటా రూ. 6 వేల చొప్పున అమ్మగా రూ. 2 లక్షల 40 వేల ఆదాయం ఆర్జించారు. మరో 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరో 90 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బంతికి పెట్టిన పెట్టుబడి కేవలం 40 వేలు మాత్రమే . ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేస్తే ప్రతి రైతు లాభాల బాట పడతారని నిరుపిస్తున్నారు.
Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు