Mango Farming in Monsoon
Mango Farming : మామిడి తోటల నుంచి ప్రతి సంవత్సరం అధిక దిగుబడి పొందటానికి, తొలకరిలో చేపట్టే యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్థుతం వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన నెల రోజులనుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే , వర్షాలకు కొత్తచిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, నూజివీడు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి.
Read Also : Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వరినాట్లు.. తొలిదశలో వచ్చే చీడపీడలు, ఎరువుల యాజమాన్యం
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. అంతే కాదు అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లడంతో దిగుబడి బాగా తగ్గింది. కాబట్టి రాబోయే కాలంలో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే, మామిడి రైతులు ప్రస్తుతం చేపట్టే యాజమాన్యమే కీలకం.
జూలై నుండి ఆగస్టు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా, నూజివీడు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి.
మామిడి మొక్కలకు నీరు చాలా అవసరం . కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకున్న పిండిపదార్థం అంతా మొక్క ఆకుల్లోని కణుపుల్లో దాగి ఉంటుంది. అది పిండి పదార్థంగా , భవిష్యత్తులో పండుగా తయారుకావాలన్నా నీరు తప్పనిసరిగా అవసరం. కాబట్టి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగునీరు, పోషకాలు అందించాలి.
Read Also : Cotton Cultivation : అధిక వర్షాలకు పత్తిలో చేరిన నీరు.. చేపట్టాల్సిన జాగ్రత్తలు