Mirchi Farmers : మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర చెల్లించకుండా వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.
వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఎదుట రోడ్డుపై మిర్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే మార్కెట్ ప్రారంభం కాగానే, మిర్చి యార్డులో జెండా పాట నిర్వహించారు. ఈ పాటలో మిర్చి రేటు రూ.20 వేల 100 పలికింది. జెండా పాటను అనుసరించి, మిగతా సరుకు రూ.18 వేల నుండి 20 వేల మధ్య ధర ఉంటుందని రైతులు భావించారు. కానీ, వ్యాపారులు మిగతా సరుకు కేవలం రూ.12 వేలు`13 వేలుగా నిర్ణయించడంతో మిర్చి రైతులకు కోపం తెప్పించింది.
జెండా పాటకు ఈ రేటుకు సగం వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహానికి లోనయ్యారు. ఎరువులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో కనీస ధర రాకుంటే.. తాము పంటలు వేసి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. జెండాపాటను అనుసరించి వాస్తవ ధర నిర్ణయించాల్సిందేనని డిమాండ్ చేశారు. మార్కెట్ అధికారులు సైతం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మార్కేట్ గేటు ముందు రోడ్డుపై నిరసనకు కర్చోని వ్యాపారులకు, మార్కెట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Also : Mango Cultivation : ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ