Coffee Beans : విశాఖ ఏజన్సీలో విరగ్గాసిన కాఫీ తోటలు – గింజల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు
Coffee Beans : విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంది.
- Sreehari A
- Published On : November 15, 2024 / 02:24 PM IST
Precautions On Collection Of Coffee Beans
Coffee Beans : విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటలు విరగ్గాశాయి. ఎరుపు, గోధుమ, పసుపు మిశ్రమ వర్ణాలతో పక్వానికి వచ్చిన పండ్లతో కాఫీ మొక్కలు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. సాధారణ దిగుబడితో పోలిస్తే ఈ ఏడాది 20 నుంచి 25 శాతం వరకు అధికంగా వస్తుందని గిరిజన రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పండ్ల సేకరణ, ప్రాసెసింగ్ చేయడంలో కొద్దిపాటి మెళకువలు పాటించినట్లయితే మంచి ధర కూడా అందే అవకాశం ఉంటుంది.
విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంది. పూత, పిందె సమయాల్లో వాతావరణం అనుకూలిస్తే మరికొంచెం పెరుగే అవకాశం ఉంది. ఏటా మార్చి నుంచి ఏప్రిల్ వరకు కాఫీ మొక్కలు పూతకు వస్తాయి. నవంబరు మొదటి వారం నుంచి కాఫీ పండ్లు పక్వానికి రావడం మొదలవుతుంది.
డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు పండ్ల సేకరణ చేపడుతారు రైతులు. అయితే ఈసారి అక్కడక్కడా కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. డిసెంబరులో పండ్ల సేకరణ ఊపందుకుంటుంది. గిరిజన సహకార సంస్థ గత ఏడాది కాఫీ గుండ్ల ధర రూ.170కు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈ ఏడాది కొనుగోలు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. అయితే రైతు అధిక ధర పొందాలంటే పార్చ్మెంట్ , పప్పు ప్రాసెస్ చేయాలని సూచిస్తోంది.. దింసా ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రోడ్యూసర్ సంస్థ.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
