Maize Crop : తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల మొకాలెత్తు దశలో, మరికొన్ని చోట్ల కండె ఏర్పడే దశలో ఉంది. అయితే ప్రస్తుతం వివిధ పొషకాల లొపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లోను జింకు లోపం సమస్య కనబడుతోంది. దీని సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి రైతులకు తెలిజేస్తున్నారు శాస్త్రవేత్త, డా. రాం ప్రసాద్.
Read Also : Paddy Cultivation : వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ
తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంటలో జింక్ లోపం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి భూములు, సున్నం ఎక్కువగా ఉన్న భూములు, నీరు నిలిచే భూములు , ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో, భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో జింక్ లోపం ఏర్పడుతుంది.
జింక్ లోపం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగక, కురచగా మారుతాయి. ఆకులు పసుపు పచ్చగా మారి, దిగుబడులు తగ్గే అవకాశాలు అధికం. ప్రస్తుతం వివిధ దశలో ఉన్న ఈ పంటలో జింక్ లోపాన్ని గుర్తించినట్లైతే రైతులు వెంటనే తగిన సవరణ చర్యల ద్వారా నష్టాలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్
మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్నకు అధిక మొత్తంలో ఎరువులు అవసరం. ముఖ్యంగా భూమినుండి ఎక్కువ పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో సూటి ఎరువులను వేసుకోవాలి. అంతే కాకుండా ఏళ్ల తరబడి ఒకే పంటను సాగుచేసే రైతులు పంటమార్పిడి చేపడితే సూక్ష్మ లోపాల సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.
Read Also : Paddy Crop Cultivation : వరి గట్లపై.. లాభాల బాట