corona cases : ఏపీలో విజృంభిస్తోన్న కరోనా..రోజుకు 1,000 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది.
- bheemraj
- Published On : March 30, 2021 / 11:35 AM IST
Corona Cases
AP corona cases : ఏపీలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ప్రభుత్వం కట్టడి చర్యలతో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. వైరస్ అంతకంతకు విజృభింస్తుండడంతో సర్కార్ మరోసారి అప్రమత్తమైంది. లాక్ డౌన్తో అనేక ఇబ్బందులు వస్తున్నందున.. వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. మొన్నటి వరకు కేవలం రెండంకెల వరకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు ఏపీలో మూడంకెలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం వైరస్ బాధితులు 6వేల 104 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,183 మంది ఉండగా.. 872 పాజిటివ్ కేసులతో విశాఖ రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31వేల 325 మందికి టెస్ట్లు చేయగా.. 997 మందికి పాజిటివ్ వచ్చింది. గతం వారం రోజులుగా ఇదే తరహా కేసులు నమోదవుతున్నాయి.
గతేడాది లాక్డౌన్తో రాష్ట్ర ప్రజల పరిస్థితి అతాలాకుతలమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు సామాన్య ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచనే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రజలందరూ స్వయం నియంత్రణతో ఉండాలని సూచిస్తుంది. అలాగే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధిస్తోంది. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగినా, ప్రజలు ఎక్కువగా గుమికూడినా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వైరస్ ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
