ప్రాణాంతక కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే దాని తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఏపీలో
ప్రాణాంతక కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే దాని తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసులే నిదర్శనం. ఈ జిల్లాలో ఒక్క వ్యక్తి కారణంగా 222మందికి కరోనా సోకింది. దీంతో జిల్లా వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. కరోనా భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. జిల్లాలోని పెదపూడి మండలంలో గొల్లల మామిడాడ గ్రామంలో మే 21న ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఆ కరోనా పాజిటివ్ ద్వారా ఇప్పటివరకు 222 మందికి వైరస్ సోకింది. ఒక్క జి.మామిడాడ గ్రామంలోనే 119 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే దాని తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇక పెదపూడి మండలంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 125కి చేరింది. మామిడాడలో మే 21న గుర్తించిన పాజిటివ్ కేసు ద్వారా జిల్లాలోని రాయవరం మండలంలో ఉన్న చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో కూడా 57 మంది వైరస్ బారిన పడ్డారు. వీరి ద్వారా మరో 46మందికి ఈ ప్రాణాంతక వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో ఒక వ్యక్తి ద్వారా ఎక్కువమందికి వైరస్ వ్యాపించడం ఇదే మొదటిసారి:
జి.మామిడాడలో తొలి పాజిటివ్ కేసు కాకినాడ జీజీహెచ్లో మే 21న చేరి అదే రోజు చనిపోవడంతో అలజడి మొదలైంది. అలా మొదలైన వ్యాప్తి చుట్టు పక్కల 5 మండలాలకు విస్తరించింది. పెదపూడి మండలంలోని పెద్దాడ, రాజుపాలెం, పైన గ్రామాల్లో ముందు ఒక్కో పాజిటివ్ కేసు నమోదు కాగా.. మిగిలిన 54 కేసులు జి.మామిడాడలోనే బయటపడ్డాయి. ఇక్కడ శాంపిల్స్ సేకరించి.. పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఒకే ఒక్కడి ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాపించడం ఇదే మొదటిసారి.
కరోనాను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం:
కరోనా వైరస్ ను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరమని ప్రభుత్వాలు, డాక్టర్లు నెత్తీనోరు బాదుకుని మరీ పదే పదే చెబుతున్నారు. కరోనా బారిన పడకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేయించుకోవాలి. కానీ, అలా చేయకుండా కరోనాను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం.
24 గంటల్లో 425 కరోనా కేసులు:
ఏపీని కరోనా భయపెడుతోంది. రెండు వారాలుగా కేసుల సంఖ్య పెరగడంతో అందరిలో ఆందోళన మొదలైంది. రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్ పరిశీలిస్తే 299 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (100), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 425కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5854కు (మొత్తం7, 496కు) చేరాయి. మరో 77మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2779కు చేరింది.
కర్నూలు జిల్లాలో వెయ్యికిపైగా కరోనా కేసులు:
రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 600కు పైగా కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2983మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 92మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోయారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.