గోదావరిలో దూకిన పిఠాపురం ఇంజినీర్ ఫ్యామిలీ.. ముగ్గురు గల్లంతు.. డెత్ నోట్ లో షాకింగ్ విషయాలు..
రాజమహేంద్రవరంలో(Rajahmundry Tragedy) ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
- V Santhosh Kumar
- Updated on- August 17, 2026 / 11:56 AM IST
AE nukaraju family jumps into godavari river rajahmundry suicide note
- గోదావరిలో దూకిన ఏఈ కుటుంబం
- ముగ్గురు గల్లంతు, మనవడు సురక్షితం
- సంచలనం రేపుతున్న డెత్ నోట్
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు (60), ఆయన భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (34) కుటుంబసమేతంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురూ నీటిలో గల్లంతవ్వగా, ఈత రావడంతో నూకరాజు మనవడు కార్తీక్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. మత్స్యకారులు బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు.
సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు:
షేక్ షాదీ ఖాన్ అనే వ్యక్తి వేధింపులు, మోసాల వల్లే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు డెత్ నోట్లో పేర్కొన్నారు. తన కుమార్తెకు సహాయం చేస్తానని నమ్మించి డబ్బులు, బ్యాంకు ఖాతాలు, విలువైన వస్తువులను షాదీ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. జూలైలోనే సౌజన్య భర్త మరణించిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావిస్తూ, షాదీ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు.
ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు:
సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం(Rajahmundry Tragedy) టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గోదావరిలో గల్లంతైన నూకరాజు, మీనా, సౌజన్యా ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది మరియు గజ ఈతగాళ్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నారు.
