Gottipati Ravi Kumar: గుడ్న్యూస్… విద్యుత్ చార్జీల తగ్గింపుపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
ప్రొవిజనల్ కలెక్షన్ పేరిట 2023-24లో యూనిట్ 40 పైసల ధరను జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేసిందని చెప్పారు. దీనిని 13 పైసలకు కూటమి ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : September 28, 2025 / 06:35 PM IST
Gottipati Ravi Kumar
Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు మరింతగా తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని 15 నెలల్లో నిలబెట్టుకున్నామని తెలిపారు.
మాజీ సీఎం జగన్ పెంచిన ట్రూ అప్ చార్జీలను ట్రూ డౌన్ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని గొట్టిపాటి చెప్పారు. ఇప్పుడు యూనిట్కు 13 పైసల చొప్పున తగ్గించిన ఛార్జీలే కాకుండా, భవిష్యత్తులో మరింత తగ్గించే దిశగా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలిపారు. (Gottipati Ravi Kumar)
నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసల మేర విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రొవిజనల్ కలెక్షన్ పేరిట 2023-24లో యూనిట్ 40 పైసల ధరను జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేసిందని చెప్పారు. దీనిని 13 పైసలకు కూటమి ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.
Also Read: మాకు ఈ రూ.30 లక్షలు వద్దు.. నా చెల్లిని నాకు తెచ్చివ్వండి: తమిళనాడు యువతి
గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లతో ప్రజలపై భారం మోపిందని గొట్టిపాటి చెప్పారు. 17 శాతం ఉన్న షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం 6.8శాతానికి తెచ్చిందని అన్నారు. స్వాపింగ్ విధానం ద్వారా పంజాబ్, హరియాణా రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చి పుచ్చుకునే దిశగా పని చేస్తున్నామని తెలిపారు.
ఏఐ, ఐటీ పరిజ్ఞానం ద్వారా వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేస్తూ విద్యుత్ డిమాండ్ అంచనా వేయగలుగుతున్నామని గొట్టిపాటి తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని చెప్పారు.
విద్యుత్ రంగంపై చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో విద్యుత్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆదాయం సమకూరుస్తున్నారని గొట్టిపాటి అన్నారు. 2014లో లోటు విద్యుత్ తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించిందని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ డిమాండ్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ అవసరాలు తీర్చలేక మళ్లీ లోటు విద్యుత్ అందించిందని అన్నారు. విద్యుత్ వ్యవస్థ ను జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని చెప్పారు.
