AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (ఎంఎల్సీసీ) యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి మెప్మా కొత్తగా యాప్ ను తీసుకొస్తుంది.
Also Read: Pawan Kalyan: పెద్దిరెడ్డికి బిగ్ షాక్…! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చే యాప్ ద్వారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదాల చెల్లింపుల్లో చాలా అవకతవకలు జరుగుతుండటంతో లక్షల రూపాయల నగదు పక్కదారి పడుతోంది. ఈ సమస్యకు యాప్ ద్వారా చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించొచ్చు. స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. నెలవారీ వాయిదాలను ఆన్ లైన్ లో చెల్లించిన వెంటనే మొబైల్ కు మెసేజ్ వస్తుంది. దీంతో వాయిదా సొమ్ము ఎవరూ స్వాహా చేయలేరు.
ఏపీలో 2.74లక్షల స్వయం సహాయ సంఘాల సమాచారం యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన 2,006 బ్రాంచిలకు లాగిన్ లు ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు.. నెలవారీ వాయిదాలను ఆన్ లైన్ లో సులభంగా, సురక్షితంగా చెల్లించొచ్చు.