యువకులకు సుపారీ ఇచ్చి సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి.. ఆమెలో అంత కసి పెరిగేలా ఆ కొడుకు ఏం చేశాడంటే?
పోలీసులు అదుపులో తల్లి శ్యామలమ్మ, మరో ఎనిమిది మంది నిందితులు ఉన్నారు.
- T Venkateshwarlu
- Published On : November 10, 2025 / 10:38 PM IST
Representative Image
Annamayya District: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులకు సుపారీ ఇచ్చి మరీ సొంత కొడుకుని హత్య చేయించింది ఓ తల్లి. పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డిని హత్య చేయించడానికి సుపారి గ్యాంగ్తో శ్యామలమ్మ అనే మహిళ రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకుంది.
పోలీసులు అదుపులో తల్లి శ్యామలమ్మ, మరో ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. జయప్రకాశ్ రెడ్డి ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతూ చదువు మానేసి, మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఆస్తి పంచాలని, మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ తల్లి శ్యామలమ్మను తరచూ వేధిస్తున్నాడు. కుమారుడి వేధింపులు భరించలేక చివరకు అతడిని చంపాలని శ్యామలమ్మ నిర్ణయించుకుంది.
Also Read: Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడుపై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ ఏమన్నారంటే? వివరాలు వెల్లడి..
తమ పొలంలో పనిచేసే మహేశ్ అనే యువకుడుతో కుమారుడిని చంపించాలని పథకం వేసింది. జయప్రకాశ్ రెడ్డిని చంపడానికి శ్యామలమ్మతో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహేశ్ అడ్వాన్స్ కింద రూ.50 వేలు తీసుకున్నాడు.
రెండు రోజుల క్రితం బి.కొత్తకోట మండలం కూని తోపు సమీపంలో రోడ్డుపై జయప్రకాశ్ రెడ్డిని సుపారీ గ్యాంగ్ హత్య చేసింది. రెండు రోజుల్లోనే కేసును ఛేదించి, తల్లే అసలు సూత్రధారిగా పోలీసులు తేల్చారు.
