Corona Patient Suicide : కరోనా భయంతో ఓ వ్యక్తి హాస్పిటల్ భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. మహమ్మారి సోకిందనే భయంతో ఆసుపత్రి భవనంపైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. విమ్స్ లో (విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో వరుసగా ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా విషాదం నెలకొంది.కరోనా సోకిందనే భయమే ప్రాణం తీసుకునేలా చేసింది.
కొద్దిరోజుల క్రితమే విమ్స్ హాస్పిటల్ భవనం పైనుండి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో మరో ఘటన అటువంటిదే జరిగింది. తాజా దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… విశాఖలోని భీమునిపట్నంకు చెందిన వేణుబాబు అనే 37 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు మెరుగైన చికిత్స కోసం జూన్ 1వ తేదీన విమ్స్ లో చేరాడు. ఇలా చికిత్స పొందుతుండగా కరోనా భయంతో వేణుబాబు ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. విమ్స్ లో ఇది రెండో కోవిడ్ ఆత్మహత్య కావటంతో ఆసుప్రతి సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాగే మరోపక్క కేజీహెచ్ లో కూడా నలుగురు కోవిడ్ పేషెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.