ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ.. రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు
పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
- Harishth Thanniru
- Published On : April 11, 2024 / 10:57 AM IST
AP TDP : సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకొనిఉన్న మాకు టికెట్ ఇవ్వకుండా కొత్తవారికి ఇస్తే మేమెలా ఊరుకుంటాం. రెబల్ అభ్యర్థిగా బరిలోకిదిగి తమ సత్తా చూపుతామని పార్టీ అధిష్టానానికి కొందరు నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీని అసమ్మతి నేతల భయం వెంటాడుతోంది.
పాడేరు నియోజకవర్గంలో టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుచరులతో భేటీ అయిన ఆమె.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరకులో మరో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సివేరి అబ్రహం సిద్ధమవుతున్నారు. అరకు నుంచి ఆయన టికెట్ ఆశించినప్పటికీ.. అధిష్టానం మొండిచేయి చూపింది. దీంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
Also Read : Janasena : జనసేనకు మరో షాక్? వైసీపీలోకి ఆ జిల్లా అధ్యక్షుడు?
మరోవైపు మాడుగుల నియోజకవర్గం టీడీపీ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరును అధిష్టానం ప్రకటించింది. అయితే, ఆయన అభ్యర్ధిత్వంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధిని మార్చాలని టీడీపీ అధిష్టానంను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైకమాండ్ వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Also Read : Cm Ramesh Vs Budi Mutyala Naidu : డిప్యూటీ సీఎం వర్సెస్ సీఎం రమేశ్.. అనకాపల్లిలో గెలిచేది ఎవరు?
పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం ర్యాలీలు, నిరసనలు చేస్తుంది. పైలా ప్రసాద్ పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో అధిష్టానం సైతం అభ్యర్థి మార్పు దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే, మాడుగుల వెళ్లేందుకు బండారు సిద్ధంగా లేరని తెలుస్తోంది. పెందుర్తిలో అవమానించి.. మాడుగులలో అవకాశంపై మాజీ మంత్రి ఆసక్తి చూపడం లేదని సమాచారం. క్రియాశీల కార్యకర్తగా మాత్రమే మిగిలిపోతానని ఇప్పటికే ఆయన బహిరంగ ప్రకటన చేశారు. దీంతో మాడుగుల టీడీపీ సీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
