AP Assembly: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా చదివిన పుస్తకాల గురించి చెబితే ఆ పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రంధాలయాల అభివృద్ధిపై ఇవాళ బుద్ధ ప్రసాద్ మాట్లాడారు.
పుస్తక పఠనంపై నేటి తరంలో ఆసక్తి పెంచేందుకు మిగతా సభ్యులు కృషి చేయాలని బుద్ధ ప్రసాద్ చెప్పారు. అమరావతిలో స్టేట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రంధాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. (AP Assembly)
రచయితల నుంచి కొన్న పుస్తకాలకు రూ.1.76 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల నుంచి గ్రంధాలయాల సెస్ను సక్రమంగా వసూలు చేసి లైబ్రరీల అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. ప్రాచీన గ్రంధాలయాలలో మౌలిక వసతులు కల్పించి వాటిని పరిరక్షించాలని అన్నారు.
Also Read: కేటీఆర్ ఆ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు?: బండి సంజయ్
దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. తనకు చిన్నప్పుడు గ్రంధాలయాలకు వెళ్లే అలవాటు లేదని, బ్రహ్మణి వచ్చాక తనకు పుస్తకాలు చదివే అలవాటు నేర్పిందని అన్నారు. అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శోభా డెవలపర్స్ ఏపీలో గ్రంధాలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
ప్రతి లైబ్రరీలో ఏయే పుస్తకాలు ఉండాలో, ఎంత అవుతుందో చూసి ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తామని లోకేశ్ అన్నారు. లైబ్రరీలను యాప్ సాంకేతికతతో అనుసంధానం చేస్తామని చెప్పారు.
డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు కోసం కేంద్రం సహకరిస్తోందని లోకేశ్ తెలిపారు. దాన్ని పంచాయతీ స్థాయిలో విస్తరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కొత్త జిల్లాల్లో నూతన లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్ 50 శాతంలోపే వసూలవుతోందని, లైబ్రరీల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ అందుబాటులో ఉంచామని అన్నారు. పుస్తకాలు చదివే అలవాటును పిల్లలకు నేర్పిస్తే వాళ్లు ఫోన్ కు దూరంగా ఉంటారని తెలిపారు.