Chandrababu Naidu: అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై సూచనలు చేశారు.
“పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. నివాస స్థలంలేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ హౌస్ సైట్స్ దక్కేలా చూడాలి. (Chandrababu Naidu)
ఏడాదిలోగా నివాస స్థలంలేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్చార్జ్ మంత్రులు చొరవ చూపాలి. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలి” అని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని చెప్పారు. పవన్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసించారు.
ఎర్ర చందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ క్యాబినెట్లో పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలు పరిశీలిద్దామని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇన్చార్జి మంత్రులు పరిష్కారం చూపాలని చెప్పారు.
అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు అందరికి గట్టిగా చెప్పాలని చంద్రబాబును పవన్ కోరారు.
జనసేనకు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అంశాన్ని కందుల దుర్గేశ్ ప్రస్థావించారు. అది పాలసీ మేటర్ అని నాదెండ్ల మనోహర్ చెప్పారు. నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టుకోవాలని సీఎం సూచించారు.
మరోవైపు, 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఆ 48 మంది పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించారు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.