ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చామంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు తిప్పి కొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. కేవలం తమ స్వయంకృషితోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని కేంద్రం ఇచ్చిన నిధులతో కాదని బాబు స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్న చంద్రబాబు….వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీఎంలపై అంతర్జాతీయంగా సైబర్ నిపుణుల హెచ్చరికల అంశాన్ని నేతల దగ్గర చంద్రబాబు ప్రస్తావించారు.
ఎలక్షన్ మిషన్-2019పై పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, గుజరాత్, యూపీలకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే లక్ష కోట్లు కేటాయించారన్న చంద్రబాబు…ఏ రాష్ట్రానికైనా ప్రధాని మోడీ అంగీకారంతోనే నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ఇచ్చినవన్నీ టోల్ పెట్టి వసూలు చేసే రోడ్లేనని.. ఏదో ఏపీని ఉద్ధరించినట్లు బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం కరెక్టు కాదన్నారు. పోలవరం నిర్మాణంలో జాప్యం చేస్తున్నారన్న ఆయన…డీపీఆర్-2 ఆమోదంలో ఏడాది జాప్యానికి గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమికి నలుగురు ప్రధానులని అనడం బీజేపీలో భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కోల్కతా సభతో బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారని విమర్శించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో రుజువులు చూపారంటూ సైబర్ నిపుణుల హెచ్చరికలను చంద్రబాబు ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం కారణంగానే వీవీప్యాట్ రశీదులు అమల్లోకి తెచ్చారన్నారు. వీవీప్యాట్ కూడా 100 శాతం నియోజకవర్గాల్లో అమలు చేయడం లేదని.. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చూస్తామన్నారు. 22 పార్టీల ప్రతినిధులతో త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం వివరించారు.
120 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదన్న ఆయన… కేవలం 20దేశాల్లోనే వినియోగిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు వాటిపై అవగాహన పెంచుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ నెల 25న రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పసుపు-కుంకుమ సభలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతి, విశాఖ, కడపలో వీటిని ఏర్పాటు చేస్తామన్న ఆయన…. మంత్రివర్గం సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.