Pawan Kalyan: మీకేం సంబంధం..? ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్..
నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా?
- Harishth Thanniru
- Published On : September 24, 2024 / 10:20 AM IST
AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేశారు. ఆ తరువాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై స్పందించారు.
Also Read : Pawan Kalyan : కనకదుర్గ ఆలయం మెట్లు శుభ్రం చేసిన పవన్ కల్యాణ్
హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ప్రశ్నించారు. నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది. తప్పు జరిగితే మాట్లాడకూడదా..? దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా.. ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాశ్ రాజు అంటే నాకు గౌరవం ఉంది. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు.. మాట్లాడితే సెక్యూలరిజంకు విఘాతం అంటే ఏమిటి అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇస్లాం మీద మీరు మాట్లాడగలారా..? జీసెస్ మీద మాట్లాడగలరా? ప్రతీసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని పవన్ అన్నారు.
తిరుపతిలో లడ్డూ వివాదంపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ.. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ప్రకాశ్ రాజు పోస్టు చేశారు. అయితే, ప్రకాశ్ రాజ్ పోస్టుపై సినీ నటుడు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణకోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏం రంగు పులుకుంటుందో..? మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. తాజాగా పవన్ సైతం ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.
