Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో భేటీ.. రేపు ప్రధాని మోదీని కలవనున్న పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఏపీ అభివృద్ధికి సహకారంపై
- Harishth Thanniru
- Published On : November 26, 2024 / 11:50 AM IST
Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఏపీ అభివృద్ధికి సహకారంపై కేంద్ర మంత్రులతో పవన్ చర్చించనున్నారు. మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలను పవన్ కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలో జనసేన ఎంపీలతో కలిసి మంగళవారం ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ కార్యాలయానికి పవన్ వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి పర్యాటక అభివృద్ధి అంశాలపై పవన్ చర్చించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ వంటి ఏడు అంశాలను షెకావత్ వద్ద పవన్ ప్రస్తావించారు. ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం ఉందని.. ఏపీలో పర్యాటక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయాలని షెకావత్ ను పవన్ కోరారు. పవన్ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. గజేంద్రసింగ్ షెకావత్ అంటే నాకు అపారమైన గౌరవం ఉందని, జలశక్తి మంత్రిగా ఉన్న సమయంలోనూ పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన ఎంతగానో నిలబడ్డారని అన్నారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించడం జరిగిందని, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ వంటి ఏడు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, తమ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ అన్నారు.
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 1గంటకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. ఆ తరువాత 3.15 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో, సాయంత్రం 4.30 గంటలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పవన్ భేటీ అవుతారు. సాయంత్రం 5.15 గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
Also Read: RGV: చిన్న కేసుకే డేరింగ్ వర్మ ఎందుకు వణికిపోతున్నట్లు?
