ముచ్చుమర్రి దారుణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 12, 2024 / 02:18 PM IST
AP Deputy CM Pawan Kalyan respond on Muchumarri Girl Death
Pawan Kalyan on Muchumarri Incident నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం ఆయన జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ముచ్చుమర్రి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 ఏళ్ల బాలిక మిస్సింగ్ పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ ఘటన నన్ను షాకింగ్కు గురి చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కూడా మైనర్లే. ఇది నన్ను ఎంతో కలిచివేసింది. పిల్లలు పాడైపోవడానికి చాలా కారణాలున్నాయి. పాఠశాల స్థాయిలో కఠినమైన శిక్షతోనే పిల్లలను సరైన దారిలో పెట్టగలం. మన సంస్కృతి గురించి పిల్లలకు సరైన విధంగా తెలియజేయాలని భావిస్తున్నానని అన్నారు.
కాగా, ముచ్చుమర్రి గ్రామంలో 6 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు. బాలికను ముగ్గురు మైనర్ బాలురు సామూహికంగా వేధించి హత్య చేసి.. మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో పడేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలిక ఆచూకీ కోసం ముచ్చుమర్రి పంప్హౌస్ నీటిలో గత 6 రోజులుగా గాలిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన రెండు ఎన్డీఆర్ఎఫ్ టీములు స్పెషల్ కెమెరాలతో నీటిలో వెతికినా బాలిక జాడ తెలియరాలేదు.
తక్షణమే న్యాయం జరిగేలా చూడాలి
సహాయక చర్యలకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ రఘువీర్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బాలిక ఆచూకీ తొందరగా కనిపెట్టి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. అంతకుముందు బాలిక కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మరోవైపు తమ కూతురు ఏమైయిందోనన్న ఆందోళనతో బాలిక తల్లిదండ్రులు విషాదంలో ముగినిపోయారు.
Also Read : ముచ్చుమర్రిలో దారుణం.. భారీగా పోలీసుల మొహరింపు.. అసలేం జరిగింది?
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తరపు బంధువులు శుక్రవారం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిందితులు ముగ్గురు మైనర్లే కావడంతో వారి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ ఇప్పటివరకు పోలీసులు కనిపెట్టలేకపోయారని, బాలిక శవాన్ని మాయం చేయడంలో నిందితుల తల్లిదండ్రుల పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలన్నారు.
Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. నర్సంపేట ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు..
