AP Global Investors Summit 2023: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. విమానాల పార్కింగ్ సమస్య.. నో టెన్షన్ అంటున్న అధికారులు
AP Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. పారిశ్రామికవేత్తలు ప్రత్యేక విమానాల్లో వస్తుండటంతో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : March 1, 2023 / 02:10 PM IST
AP Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. వీరిలో కొంత మంది ప్రత్యేక విమానాల్లో విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది. మొత్తం 25 కు ఫైగా ప్రత్యేక విమానాలు వస్తున్నట్టు అధికారులకు సమాచారం ఉంది.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో 18 విమానాలకు సరిపడా పార్కింగ్ మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఎక్కువ విమానాలు వస్తే పార్కింగ్ సమస్య ఎదురవుతుందని భావిస్తున్నారు. కాగా, ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజమండ్రి విమానాశ్రయంలో పార్కింగ్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఏయూలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది.
పెట్టుబడిదారులకు 21 రోజుల్లో అనుమతులు
ఆంధ్రా యూనివర్సిటీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పనులను పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి 10 టీవీతో మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారికి 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని తెలిపారు. 14 సెక్టార్లుల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని, రూ.2 లక్షల కోట్లుకు పైగా పెట్టుబడుల వస్తాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. 25 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా ప్రతినిధులు వస్తున్నారని అన్నారు.
CM Jagan Challenge: 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేసే దమ్ముందా? చంద్రబాబు, పవన్కు సీఎం జగన్ సవాల్
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తున్నాం
కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నామని, ఎన్నికల కోడ్ అభ్యంతరం లేకపోతే ఈ సదస్సులోనే ప్రకటిస్తామని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల ప్రయోజనాలు గురించి పెట్టుబడిదారులకు వివరిస్తామని.. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. సీఎం జగన్ 2వ తేది సాయంత్రం వచ్చి.. 4న తిరిగి వెళతారని తెలిపారు. రాష్ట్ర దశ దిశ మార్చే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
