AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగుల పిల్లల అకౌంట్లోకి రూ.13వేలు.. ఉత్తర్వులు జారీ..
AP Govt Talliki Vandanam Scheme : ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది.
- Harish Thanniru
- Published on- July 18, 2026 / 08:16 AM IST
AP Govt Talliki Vandanam Scheme
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్
- అంగన్వాడీ పిల్లలకూడా పథకం వర్తింపు
AP Govt Talliki Vandanam Scheme : ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 22వ తేదీన అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో పథకం నిధులను జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిర్ణయం 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55,792 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 42,860 మంది, గిరిజన ప్రాంతాల్లో 4,695 మంది, పట్టణ ప్రాంతాల్లో 8,237 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 47,555 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు సమాచారం. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500 గౌరవ వేతనం, ఆయాలకు రూ.7,000 చెల్లిస్తున్నారు. అయితే తల్లికి వందనం సహా సంక్షేమ పథకాల అర్హత కోసం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు కుటుంబ ఆదాయం రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం ఈ పరిమితిని మించడంతో ఇప్పటివరకు వారి పిల్లలు ఈ పథకానికి దూరమయ్యారు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధనలో సడలింపు ఇవ్వడంతో వారికి కూడా పథకం వర్తించనుంది.
ప్రభుత్వం తాజా నిర్ణయం పట్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలకు మేలుచేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి నారా లోకేష్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు చాలాకాలంగా ఈ అంశంపై విజ్ఞప్తులు చేస్తున్నారని, వారి ఆకాంక్ష నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.
