Ap Government: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందంపై ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధుల సంతకాలు చేశారు. ఏపీలో కొందరికే పరిమితమైన ఎడ్యు–టెక్ విద్య ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్లలోని పేదపిల్లలకు అందుబాటులోకి రానుంది. ఏడాదికి రూ.20 వేలు నుంచి రూ. 24వేలు పైబడి చెల్లిస్తేకాని లభించని ‘బైజూస్’ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ అందుబాటులోకి రానుంది. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యార్థులకు బైజూస్ ద్వారా విద్యాబోధన జరగనుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని అన్నారు. 2025లో సీబీఎస్ఈ నమూనాలో పరీక్షలు రాయనున్న ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులను సుశిక్షితులు చేసేందుకు ఇంకొన్ని అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులకు, సిలబస్తోపాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్ యాప్, నేర్చుకునేందుకు ట్యాబ్లు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 4.7లక్షల మందికి ట్యాబ్లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ సెప్టెంబరులోనే ట్యాబ్లు ఇస్తామని సీఎం తెలిపారు. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని, వీడియోకంటెంట్ ద్వారా పిల్లలు నేర్చుకునేందుకు నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు పెడతామని తెలిపారు.
ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్ సీఈవో రవీంద్రన్ మాట్లాడుతూ.. యంగ్ స్టార్టప్కన్నా ముఖ్యమంత్రి వేగంగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. మే 25న తొలి సమావేశం జరిగితే.. వెనువెంటనే ఒప్పందం కుదుర్చుకున్నారని కితాబును ఇచ్చారు. నమ్మశక్యం కానిరీతిలో సీఎం వేగంగా స్పందించారని రవీంద్రన్ కొనియాడారు. ఇదిలాఉంటే సీఎం సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్.సురేష్కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్పాలసీ హెడ్ సుస్మిత్ సర్కార్ సంతకాలు చేశారు. వర్చువల్ పద్ధతిలో ‘బైజూస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్ అమెరికా నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.