AP Mega DSC 2025
AP Mega DSC: ఏపీలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు మే 15వ తేదీ వరకు అవకాశం ఉంది.
డీఎస్సీ నోటిఫికేషన్ లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ, గతేడాది నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో 40శాతం అర్హత మార్కులగా ఉన్నాయి. బీఈడీ చేసేందుకు డిగ్రీలో 40శాతం అర్హత మార్కులుగా ఉన్నాయి. బీఈడీ చేసి, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసిన తరువాత ఇప్పుడు 45శాతం మార్కులు నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Fishermen welfare scheme: “మత్స్యకారుల సేవలో” పథకం ప్రారంభం.. ఉపయోగాలేంటి? ఏ ప్రయోజనాలు అందుతాయి?
డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు నిబంధనను తొలగించి.. 40శాతం మార్కుల నిబంధనను అమలు చేయాలని పలువురు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. దీంతో వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్కుల శాతంపై స్పందించిన పాఠశాలల విద్యాశాఖ 40శాతం మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ షెడ్యూల్..
◊ ఏప్రిల్ 20- మే 15: ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ
◊ మే 20 నుంచి: నమూనా పరీక్షలు
◊ మే 30 నుంచి: హాల్టికెట్ల డౌన్లోడ్
◊ జూన్ 6 నుంచి జులై 6 వరకు: పరీక్షలు
◊ అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల
◊ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
◊ అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల
◊ ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన