Amaravathi: అమరావతి.. ఆంధ్రులందరికీ రాజధాని.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు.
- Ravikanth 10tv
- Published On : November 16, 2021 / 03:41 PM IST
Amaravathi
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. ఈ లెక్కన అమరావతి.. రైతులకు మాత్రమే రాజధాని కాదని.. అది ఆంద్రప్రదేశ్ లోని ప్రజలందరి రాజధాని అని చెప్పారు. రాష్ట్ర రాజధాని అంటే కర్నూలు ప్రజలకు, వైజాగ్ ప్రజలకు.. అలా అన్ని జిల్లాల ప్రజలకు చెందినదని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటం.. వారి కోసం వారు చేసింది కాదని.. అది దేశ ప్రజలందరి కోసం చేసినదని అన్నారు.
మరోవైపు.. న్యాయవాది శ్యాం దివాన్.. అమరావతి చట్టం గురించి ధర్మాసనానికి వివరించారు. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ల్యాండ్ పూలింగ్ చేశారని చెప్పారు. అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి వివరించిన శ్యాం దివాన్.. ఏకంగా 33 వేల ఎకరాల భూములను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు. గ్రామ సభలు నిర్వహించి.. రైతులకు ప్రభుత్వం తరఫున కలగబోయే ప్రయోజనాలను సైతం వివరించారని చెప్పారు. అమరావతి ప్రజల రాజధాని అన్న న్యాయవాది.. అందులో రైతుల భాగస్వామ్యం కీలకమని చెప్పారు.
