Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో వివాదం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫొటో అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
- Harish Thanniru
- Updated on- September 10, 2025 / 12:44 PM IST
Pawan Kalyan
Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: Raja Singh: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు రాజాసింగ్ రిక్వెస్ట్.. అలాచేస్తే మరోసారి అధికారం మీదే..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ప్రదర్శిస్తున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. చిత్రపటాల ప్రదర్శన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విధానం తీసుకొచ్చేవరకు కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్లో కోరారు.
ఈ పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పవన్ ఫొటో ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రజాహిత ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా కోర్టును ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేసిన కోర్టు.. రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ దాఖలైందని అభిప్రాయపడింది. డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదని నిషేధం ఎక్కడ అంది అంటూ హైకోర్టు ప్రశ్నించింది.
సమాజానికి మేలు చేసే విధంగా, నిజమైన ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ లక్ష్యాలతో కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు మంచిదికాదంటూ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
