Janasena : ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు.. ఎక్కువ సీట్లపై జనసేన పట్టు.. పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్
Janasena Local Body Elections AP : ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధిష్టానం దృష్టిసారించింది. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.
- Harish Thanniru
- Published on- July 17, 2026 / 11:14 PM IST
ap local body elections janasena pawan kalyan seat sharing strategy
Janasena Local Body Elections AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయం వేడెక్కుతోంది. ఓ వైపు సర్..ఇంకోవైపు జనగణన ప్రాసెస్ నడుస్తుండగానే..స్థానిక ఎన్నికలపై పార్టీలు జోరు పెంచుతున్నాయి. సంస్థాగతం బలపడాలని భావిస్తున్న జనసేన లోకల్ బాడీ ఎన్నికలను అస్త్రంగా మల్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పరిమిత సంఖ్యలో 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాల్లోనే పోటీ చేసింది జనసేన. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమ బలాన్ని చాటుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కోసం చాలా తగ్గామ్..లోకల్ పోరులో మాత్రం జుకే కా నహీ అంటోంది జనసేన.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జనసేన చీఫ్ పవన్. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న చోట్ల రాజీ లేకుండా పట్టుబట్టి సీట్లు తీసుకోవాలని.. ఈ ఎన్నికల్లో బలపడితే..నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు తమ బలం ఇంకా పెరుగుతుందని లెక్కలు వేసుకుంటోంది జనసేన. క్షేత్రస్థాయి క్యాడర్ నుంచి ఇదే అభిప్రాయం రావడమే కాకుండా అధిష్టానం ఆలోచన కూడా ఇలానే ఉంది.
సార్వత్రిక ఎన్నికల టైమ్లో కూటమి విజయమే ప్రధాన లక్ష్యంగా భావించి పవన్ కల్యాణ్ అనేక రాజకీయ త్యాగాలు చేశారని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా కూటమి కోసమే 21 సీట్లకు పరిమితం అయ్యామని అంటున్నారు. ఇప్పుడు త్యాగం చేశాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు వస్తాయని పదే పదే పవన్ కల్యాణ్ క్యాడర్కు హామీ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడదే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దానికితోడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈసారి తగ్గేదే లేదని వ్యాఖ్యలు చేయడంతో జనసేన మరింత పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల తరహాలోనే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఉంటుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ మధ్యే మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల సీట్ల కేటాయింపుపై చర్చించారని అంటున్నారు. టీడీపీకి 85 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం సీట్లు తీసుకునేలా ఓ అంచనాకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా ఈ తరహా చర్చ జరిగినట్లు జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ సీట్ల ఆధారంగా లోకల్ సీట్లు కేటాయింపు జరిగితే క్యాడర్ మనోభావాలను దెబ్బతినే అవకాశముందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలో అంతర్గతంగా చర్చ జరుతుగుతుండటంతో.. క్యాడర్లో జోష్ నింపేందుకు నాదెండ్ల మనోహర్ తగ్గేదేలే అని స్టేట్మెంట్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు నేతలు. అయితే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు తీసుకోవాలన్న అంశంపై పవన్ కూడా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తల ఆత్మగౌరవం, పార్టీ విస్తరణే లక్ష్యంగా స్థానిక ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు జనసేనాని. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన కనిపిస్తుంది. జనసేన ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.
