చివరి దశలో ఉన్న మీతో మాకేం పని : జేసీకి మంత్రి కౌంటర్

జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.

  • Publish Date - November 7, 2019 / 02:21 PM IST

జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.

జేసీ ట్రావెల్స్ సీజ్ పై జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని. జేసీని వైసీపీలోకి రావాలని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు. రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో తమకేం పని అని ప్రశ్నించారు. బస్సుల సీజ్‌ విషయంలో జేసీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బస్సుల సీజ్‌ విషయంలో సర్కార్‌ చట్ట ప్రకారమే వ్యవహరించిందని స్పష్టం చేశారు. 

దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్‌పై కూడా మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ మండిపడ్డారు. కొందరు నేతల్ని టార్గెట్ చేసుకున్నారని.. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన 80 బస్సులు సీజ్ చేశారన్నారు. 74 ఏళ్ల ట్రాన్స్‌పోర్ట్‌లో తనకు అనుభవం ఉందని.. ఒక్క దివాకర్‌ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా అంటూ ప్రశ్నించారు. మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారు. ట్రిబ్యునల్ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదన్నారు. మరోవైపు తమ పార్టీలో చేరితే కేసులు ఉండవని తనపై ఒత్తిడి చేస్తున్నారని జేసీ కామెంట్ చేశారు. 

తన బస్సులనే ఎందుకు సీజ్‌ చేస్తున్నారని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. రూల్స్‌ పాటించని వాహనాలను సీజ్‌ చేయాల్సిందేనని అన్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు మాత్రమే రూల్స్‌ పాటించడం లేదా? ఐదు నెలల్లో ఎన్ని బస్సులు సీజ్‌ చేశారని ప్రశ్నించారు. ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చినా 25 బస్సులు విడుదల చేయట్లేదని.. ఎవరికైనా చెప్పుకోండన్న రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు.

కక్ష సాధింపులో భాగంగానే తన బస్సులు సీజ్ చేశారని ఆరోపించారు. తన క్వారీని మూసివేసేందుకు ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వైసీపీలోకి రమ్మని ఓ పెద్దాయన తనను ఆహ్వానించారని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.