AP MLC Elections 2024 : డిసెంబర్ 5న గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
AP MLC Elections 2024 : వచ్చే డిసెంబర్ 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
- Sreehari A
- Published On : November 11, 2024 / 10:28 PM IST
east godavari elections
AP MLC Elections 2024 : తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. వచ్చే డిసెంబర్ 5న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఈ నెల 18 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 19న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. వచ్చే డిసెంబర్ 5న ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 2021లో ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీడీఎఫ్ పార్టీ తరపున యుటిఎఫ్ నేత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గెలిచారు. అయితే, 2023 డిసెంబర్లో మరణించడంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలివే :
- నవంబర్ 11, 2024 : గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- నవంబర్ 18న నామినేషన్లకు చివరి తేదీ
- నవంబర్ 19న నామినేషన్ల పరిశీలన
- నవంబర్ 21న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ
- డిసెంబర్ 05న పోలింగ్ తేదీ
- ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్
- డిసెంబర్ 09న ఓట్ల లెక్కింపు
2025 మార్చి 29 తేదీతో తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
మరోవైపు.. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయింది. గత అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు జిల్లాల వారీగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Read Also : సర్కార్కు సవాల్గా మారిన కులగణన సర్వే.. సమాచారం సేకరించేందుకు వెళ్లిన వారిపై జనం గరం!
