నేడే నిమ్మగడ్డకు ఫైనల్ డే.. నెక్స్ట్ఏంటీ?
- vamsi
- Published On : March 31, 2021 / 07:53 AM IST
Nimmagadda Ramesh Kumar
Nimmagadda Ramesh Kumar:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయిన ఎన్నికల అధికారి.. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిన నిమ్మగడ్డ.. కోర్టుల్లో ప్రభుత్వంపై యుద్ధం చేసి గెలిచి, నిలిచి వివాదాల్లో వ్యక్తిగా మారారు. ఎట్టకేలకు నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయ్యే సమయం వచ్చేసింది.
ఇవాళ(31 మార్చి 2021) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనుంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది అంటూ ఎన్నికలను అకస్మాత్తుగా నిలిపివేసిన తర్వాత.. సీఎం జగన్ నేరుగా విమర్శలు చేశారు. తరువాత ఆయన ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైతే వైసీపీ ప్రభుత్వం మాత్రం నో అని చెప్పగా.. ఎన్నికలు నిర్వహించేశారు. ప్రతీ విషయంలో ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతూనే వచ్చాయి.
మంత్రుల విమర్శలు, అరెస్ట్ చెయ్యాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు.. ఇలా ఎన్నో పరిణామాలు.. ఎట్టకేలకు నేటితో నిమ్మగడ్డ పదవీ విరమణ చేయబోతున్నారు. అంతేనా.. తాను గవర్నర్కు రాసిన లేఖలు లీక్ అవుతున్నట్లుగా.. హైకోర్టు మెట్లెక్కారు. ఈ పరిణామాలు అన్నీ అయిపోగా.. నేటితో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తోంది.
మరోవైపు నిమ్మగడ్డ స్థానంలో కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్నీని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గవర్నర్ కూడా ఆమె నియామకానికి ఆమోదం తెలపగా.. ఏప్రిల్ ఒకటి నుంచి ఆమె, కొత్త ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత ఏం చేయబోతున్నారు? అనేది ఆసక్తికర విషయం.
