Ap Police To Book Case And Seize Bike
18 Hour Curfew AP : ఏపీలో తొలి రోజు కర్ఫ్యూ మొదలైంది. బుధవారం(మే 5,2021) ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 12 గంటల తర్వాత అన్నీ బంద్ అయ్యాయి. మ.12 నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటలకు అంటే 18గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
కాగా, కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాదు బండి కూడా సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, వ్యాక్సిన్ తీసుకునే వారికి మినహాయింపు ఉంటుందన్నారు.
ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే 18గంటల పాటు రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. మ.12 తర్వాత ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ప్రజా రవాణ పూర్తిగా నిలిచింది. ఆటోలు, ట్యాక్సీలు అన్నీ బంద్ అయ్యాయి. అనవసరంగా బయటకు వస్తే పోలీసులు కేసులు పెడతారు. సో, పనులేమైనా ఉంటే మ.12లోపే పూర్తి చేసుకోవడం బెటర్.