Heavy rains
AP Rains : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం వరకు వర్షాలు దంచికొట్టాయి. గత మూడునాలుగు రోజులుగా వర్షాలు (AP Rains) తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ అధికారులు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ కారణంగా సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సోమవారం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.