APSRTC: ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్ పాస్లు.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేయండి
ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)విద్యార్థుల కోసం ఉచిత, రాయితీ బస్ పాస్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది.
- V Santhosh Kumar
- Updated on- July 4, 2026 / 06:08 PM IST
Apsrtc issuing free bus passes for school and college students in chittoor district
- విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు
- ఉచిత మరియు రాయితీ సౌకర్యం
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం
ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థుల కోసం ఉచిత, రాయితీ బస్ పాస్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని తిరుపతి, తిరుమల, అలిపిరి, శ్రీకాళహస్తి, కుప్పం, పుత్తూరు, పలమనేరు వంటి పలు ప్రధాన డిపోల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ పాస్లను మంజూరు చేస్తున్నారు.
ఉచిత బస్ పాస్ల అర్హతలు, నిబంధనలు:
ఆర్టీసీ నిబంధనల ప్రకారం 12 ఏళ్లలోపు ఉండి ఏడో తరగతి చదివే బాలబాలికలకు, అలాగే 18 ఏళ్లలోపు ఉన్న పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందజేస్తారు. అయితే విద్యార్థి నివాసం నుండి స్కూల్ లేదా కాలేజీ గరిష్టంగా 20 కిలోమీటర్ల లోపు దూరం ఉండాలి. ఈ ఉచిత పాస్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు బస్సుల్లో ప్రయాణించడానికి చెల్లుబాటు అవుతాయి. దీనితో పాటు, 50 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారి కోసం 33 శాతం రాయితీతో నెలవారీ, త్రైమాసిక, వార్షిక ‘స్టూడెంట్ పెయిడ్ పాస్లను’ కూడా ఆర్టీసీ జారీ చేస్తోంది.
దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు:
విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఈ పాస్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేశాక వచ్చే రిజిస్ట్రేషన్ ఫారమ్ను ప్రింట్ తీసుకోవాలి. ఆ ఫారమ్పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి, సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్ లేదా కాలేజీ ప్రిన్సిపల్తో సంతకం చేయించి, స్టాంప్ వేయించాలి. ఈ దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీని జతచేసి, నామినేషన్ ఐడీ కార్డు ఫీజు రూ.50 చెల్లించి స్థానిక డిపోలో అందజేస్తే బస్ పాస్ జారీ చేస్తారు.
