Avinash Reddy in Hyderabad
YS Viveka Case: అర్థం పర్థం లేని విషయాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) పెద్దగా చూపుతోందని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్తో హైదరాబాద్కు ఎంపీ అవినాశ్రెడ్డి వచ్చారు. భాస్కర్ రెడ్డికి ఉస్మానియాలో అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయనను జడ్జి ముందు హాజరుపర్చుతారు.
ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ… విచారణలో సీబీఐ అధికారులు కొన్ని అంశాలను విస్మరిస్తున్నారని చెప్పారు. సీబీఐ తీరు సరిగాలేదని అన్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సీబీఐ ఉన్నాధికారులకు తెలిపామని చెప్పారు. ఇంతకుముందు ఉన్న అధికారులు చేసిన తప్పులనే మళ్లీ కొత్త అధికారులు చేస్తున్నారని అన్నారు.
తాము లేవనెత్తుతున్న పలు ముఖ్యమైన అంశాలపై సీబీఐ అధికారుల నుంచి స్పందన రావట్లేదని తెలిపారు. వైఎస్ వివేక ఫోనుతో పాటు లేఖను దాచిపెట్టాటని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డే చెప్పారని అన్నారు. వైఎస్ వివేక హత్యకు గురయ్యారన్న అంశం తన కంటే ముందు రాజశేఖర్ రెడ్డికి తెలుసని అన్నారు. ఈ హత్య విషయాన్ని తానే ముందుగా పోలీసులకు చెప్పానని తెలిపారు.
పోలీసులకు సమాచారం అందించిన తననే దోషిగా చూస్తున్నారని అన్నారు. వివేకా హత్యకు ముందు, తర్వాత స్టాంప్ పేపర్ల చోరీ జరిగిందని అన్నారు. ఈ విషయాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదని తెలిపారు. అలాగే, వివేక స్వయంగా రాసిన ఓ లేఖను కూడా సీబీఐ అధికారులు పట్టించుకోవట్లేదని అన్నారు. వాటితో పాటు మరికొన్ని విషయాలను కూడా సీబీఐ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
“రెండో భార్యకు ఆస్తి రావాలని వివేక అనుకున్నారు. వాస్తవాల ఆధారంగా విచారణ జరపాలి. స్టాంప్ పేపర్లు పోతే విచారణ జరపడం లేదు. నా నిజాయితీ నిరూపించుకుంటా. వైఎస్ భాస్కర్ రెడ్డిని ఊహించిన విధంగానే అరెస్టు చేశారు. దీనిపై స్పదించేందుకు మాటలు రావట్లేదు. మేం చెప్పిన అంశాలను సీబీఐ లెక్కలోకి తీసుకోవడం లేదు. మేము ధైర్యం కోల్పోం.. నిజాయితీ నిరూపించుకుంటాం” అని అవినాశ్ రెడ్డి చెప్పారు.