దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత చేసిన ఆరోపణలపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. ఇవాళ అవినాశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీబీఐ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన సునీత అనంతరం లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకున్నారని అన్నారు.
లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ తనపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అవినాశ్ రెడ్డి చెప్పారు. లెటర్ ను దాచి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఆ విషయాన్ని పోలీసులు బయటకు ఎందుకు చెప్పలేదని అడిగారు. ఎర్ర గంగిరెడ్డికి నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేశాడని అన్నారు. అందుకు ఎర్ర గంగిరెడ్డి వచ్చాడని తెలిపారు.
వివేకానందరెడ్డిని తానే చంపినట్లు దస్తగిరి ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అతడికి ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. సునీత ఒప్పదం వల్లే అతడు అప్రూవర్గా మారాడని ఆరోపించారు. అతడికి బెయిల్ వచ్చినప్పటికీ సునీత అభ్యంతరాలు చెప్పలేదని అన్నారు. తనపై అనవసర నిందలు మోపుతున్నారని అవినాశ్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.