Bandaru Satyanarayana Murthy On Roja (Photo : Google)
Bandaru Satyanarayana Murthy – Roja : మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు గురించి బండారు సత్యనారాయణ స్పందించారు. మంత్రి రోజాను ఉద్దేశించి అలాంటి ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారాయన.
‘నాపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడింది. ఉరిశిక్షకైనా సిద్ధమే. దుర్మార్గపు చర్యలతో జగన్ రెడ్డి మమ్మల్ని భయపెట్టలేరు. ఉండే ఈ నాలుగు మాసాలైనా బుద్ధి మార్చుకుంటే జగన్ కే మంచిది. నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి. కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరం. మహిళలంటే నాకెంతో గౌరవం.
Also Read..Atchannaidu: ఈ తేదీలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారు: అచ్చెన్నాయుడు
గౌరవంతో బతికే కుటుంబాలపై రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పా. సాటి మహిళలను కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారు. రోజాపై నేను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి జగన్ కూడా విశ్లేషించుకోవాలి’ అని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ కావడం, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు రూ.25వేల పూచీకత్తుతో బండారు సత్యనారాయణకు బెయిల్ ఇచ్చింది.
అంబేద్కర్ రాజ్యాంగానికి గౌరవం ఉందని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. పోలీస్ స్టేషన్ లో తాను ఎలాంటి ఇబ్బంది పడలేదన్నారు. తనకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇచ్చారని తెలిపారాయన. తన కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు బండారు సత్యనారాయణ మూర్తి. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. కష్ట సమయంలో లోకేశ్ నాకు మనోధైర్యం ఇచ్చారని, ఎంపీ రామ్మోహన్ నాయుడు మద్దతుగా నిలిచారని బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు.