Manchu Family Dispute
Mohan Babu: మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుతుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, సంక్రాంతి పండుగ వేళ మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీకి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది. దీంతో రెండు రోజులుగా ట్విటర్ వేదికగా మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా మోహన్ బాబు ఈ వివాదంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్నవారందర్నీ పంపించి వేయాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
Also Read: Manchu Manoj : నేనొక్కడినే వస్తా.. కూర్చోని మాట్లాడుకుందాం.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్..
జల్ పల్లిలోని తన ఆస్తులను కొంత మంది ఆక్రమంగా ఆక్రమించుకున్నారని, తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి పంపించేయాలని, తన ఆస్తులను తనకు అప్పగించాలని మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మోహన్ బాబు ఆస్తులపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు కలెక్టర్ సూచించారు. అయితే, జల్ పల్లిలోని ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నాడు. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్నిరోజులుగా మంచు మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు.