Vishnu Kumar Raju: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తప్పుచేశారు..! ఈసారి వైసీపీ గెలుపు అసాధ్యం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక్కరినే నిలబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దతప్పు చేశారని, కనీసం ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపితే కనీసం రెండు ఎమ్మెల్సీ స్థానాలైనా వచ్చేవని అన్నారు.
- Harish Thanniru
- Updated on- March 24, 2023 / 12:11 PM IST
Vishnu Kumar Raju
Vishnu Kumar Raju: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఆరు వైసీపీ (YCP) కైవసం చేసుకోగా, ఒక స్థానం టీడీపీ (TDP) విజయం సాధించింది. అయితే, ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థి పసుమర్తి అనురాధ (Pasumarthi Anuradha) విజయం సాధించటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి కేవలం 19మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆమెకు 23 ఓట్లు రాగా, మిగిలిన నాలుగు ఓట్లు వైసీపీ ఎమ్మెల్యేలవి పోలయ్యాయి. ఇద్దరు మాత్రం బహిరంగానే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. వారిలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotareddy Sridhar Reddy), ఆనం రామనారాయణరెడ్డి
(Anam Ramanarayana Reddy). వీరుకాకుండా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs)ఎవరు అనేది ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది.
Minister Roja: జగన్ను మోసం చేసిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తప్పు చేశారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక్కరినే నిలబెట్టి పెద్దతప్పు చేశారని, కనీసం ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపితే కనీసం రెండు ఎమ్మెల్సీ స్థానాలైనా వచ్చేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తిని చూస్తుంటే మరో వైసీపీయేతర అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి హిందుపురం వరకు స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకూడా వైసీపీకి రావడం కష్టమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీల విషయానికి వస్తే.. మూడు ఎంపీ స్థానాలు మినహా వైసీపీ విజయం సాధించలేదని విష్ణు కుమార్ రాజు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే జగన్ మాత్రం ఢిల్లీ వెళ్లి సన్మానాలు చేస్తున్నారని అన్నారు. దీంతో బీజేపీ సపోర్టు జగన్ కు ఉందని వైసీపీ, బీజేపీ ఒక్కటేనని ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆగ్రహంవ్యక్తం చేశారు. దానివల్లే పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ అధికారంలోకి రాదని విష్ణుకుమార్ రాజు అన్నారు.
