BJP: ఏపీలో బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసన దీక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ బీజేపీ మంగళవారం జూన్ 8న రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష చేపట్టనుంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే వారి ప్రధాన డిమాండ్ గా పేర్కొన్నారు.
- Subhan Ali Shaik
- Published On : June 8, 2021 / 08:48 AM IST
Bjp Ap
BJP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలంటూ బీజేపీ మంగళవారం జూన్ 8న రాష్ట్ర వ్యాప్త నిరసన దీక్ష చేపట్టనుంది. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే వారి ప్రధాన డిమాండ్ గా పేర్కొన్నారు. ఈ నిరసన దీక్షను ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకూ నిర్వహించారు.
ఆందోళనలో భాగంగా కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి వద్దనే నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో కన్నా, మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శనక్కాయల అరుణ, తాళ్ళ వెంకటేష్ యాదవ్ లు పాల్గొన్నారు.
జగన్ వ్యవసాయాన్ని తుంగలో తొక్కి రైతులను గాలికొదిలేశారు. మద్దతు ధర కోసం 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పట్టించుకోకుండా మద్ధతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు.
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్న రైతులకు మాత్రం పరికరాలు అందించడం లేదు. నీటిపారుదల ప్రాజెక్ట్ లపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం రివర్స్లో వెళుతోంది.
ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ప్రజలనే కొనుక్కుంటుంది. ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
