Botsa satyanarayana: ఏపీ బడ్జెట్ పై బొత్స సత్యనారాయణ ఆసక్తికర కామెంట్స్ .. వాటిని విస్మరించారంటూ..
ఏపీ బడ్జెట్ పై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, లోకేశ్ ను ..
- Harish Thanniru
- Published on- February 28, 2025 / 02:07 PM IST
Botsa Satyanarayana
Botsa satyanarayana: కూటమి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ పై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. బడ్జెట్ ఆత్మస్తుతి పర నిందలా ఉందని ఎద్దేవా చేశారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను పొగడటమే సరిపోయిందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని, మహిళలు, విద్యార్థులు, రైతుల కోసం చేసిన కేటాయింపులు అరకొరగా ఉన్నాయని బొత్స అన్నారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప వేటికీ బడ్జెట్ లో ప్రధాన్యత కల్పించలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. మహిళలకు 15వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ, కేటాయింపులు రూ. 9,400 కోట్లు చేశారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు..? ఎక్కడ సేకరిస్తారో చెప్పలేదని అన్నారు. 50లక్షల మందికి వైసీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం. అన్నదాత సుఖీభవ ఇస్తే 12వేల కోట్లు కావాలి. 18ఏళ్ళు మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదని బొత్స విమర్శించారు.
Also Read: AP Budget: రైతులకు శుభవార్త.. బడ్జెట్లో భారీగా కేటాయింపులు.. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ..
రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి 3వేల కోట్లు కేటాయించాం.. కానీ, ఈ బడ్జెట్ లో 300 కోట్లు కేటాయించారని బొత్స సత్యనారాయణ అన్నారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్ పై కేసు పెట్టారు. ఒక్క కిలో ఒక్క క్వింటా ఒక్క బస్తా అయినా కొన్నారా..? ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలని మాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది అంటూ బొత్స వ్యాఖ్యానించారు.
