Heavy cash, gold seized in Kurnool : కర్నూలు జిల్లాలో మరోసారి కరెన్సీ కట్టలు కలకలం రేపాయి. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో ఏకంగా 3 కోట్ల రూపాయల నగదుతో పాటు 55లక్షల విలువైన బంగారం బయటపడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ ప్రయాణికుడి నుంచి రెండు బ్యాగులను పోలీసులు తనిఖీ చేశారు. అందులో భారీగా నగదును గుర్తించారు.
అయితే దానికి సంబంధించి ఆ వ్యక్తి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్ బంజారాహిల్స్లోని పీఎంజె జ్యువెల్లరీకి చెందిన 55 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో కర్నూలు పోలీస్ స్టేషన్కు తరలించారు.
అయితే ఈ డబ్బు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీకి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రావెల్ డ్రైవర్గా పనిచేసే చేతన్ కుమార్.. ఈ నగదును బెంగళూరు తరలించి అక్కడ్నుంచి చెన్నైకు తరలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని.. రెగ్యులర్ తనిఖీలు చేస్తున్న సమయంలోనే నగదు బయటపడిందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.