Nara Chandrababu Naidu : పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. వరద బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వదర బాధితుల్లో విశ్వాసం కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
వరదలను ఉహించలేదని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యవస్ధలను, అధికారులను అప్రమత్తం చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. ముఖ్యమంత్రి జగన్ మొక్కుబడిగా గాలిలో తిరిగి వెళ్లిపోయారని చంద్రబాబు విమర్శించారు. వరదలు వచ్చి ఇన్ని రోజులవుతున్నా బాధితులకు కనీస అవసరాలు అందడం లేదన్నారు. దున్నపోతుపై వాన పడినట్లు ప్రభుత్వం వ్యవహారించిందని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులను ఎవరైనా నిలదీస్తే బెదిరించే పరిస్ధితికి వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా చెప్పిందన్నారు. అప్పులతో శ్రీలంక దివాలా తీసిందని, పాలకులు పారిపోయే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. శ్రీలంక పరిస్ధితులే రాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయని అన్నారు. జగన్ పాలన రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. ప్రభుత్వం చేతకానితనంతో పోలవరం ప్రాజెక్టు డయాప్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు లోయర్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతిందని కేంద్రం చెప్పిందన్నారు.
Boat Accident : చంద్రబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం
ప్రాజెక్టు మధ్యలో కాంట్రాక్టర్ను మార్చొద్దని పీపీఏ, కేంద్రం చెప్పినా జగన్ వినలేదన్నారు. మధ్యలో కాంట్రాక్టర్ను మార్చితే ఏదైనా నష్టం జరిగితే ఎవరిని బాధ్యులను చేయాలో తెలియని పరిస్ధితి వస్తుందని చెప్పినా జగన్ ప్రభుత్వం వినలేదన్నారు. కాంట్రాక్టర్ ను మార్చే సమయంలో వరదలు వచ్చి నష్టం జరిగిందన్నారు. జరిగిన నష్టానికి ఎవరినీ బాధ్యులు చేయలేని పరిస్ధితి నెలకొందన్నారు.
ప్రభుత్వం అసమర్ధతతో లోయర్ కాఫర్ డ్యామ్ పాడైందన్నారు. నిర్వాసితుల సమస్యలను పట్టించుకునే పరిస్ధితి లేదని వాపోయారు. గతం కంటే ఎక్కువ పరిహారం ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పటికీ పరిహారం ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వరద బాధితులకు రూ.10వేల పరిహారం ఇస్తుంటే.. జగన్ ప్రభుత్వం రూ.2వేలే ఇస్తోందన్నారు. తెలంగాణ గురించి కావాలనే మాట్లాడుతున్నారని అన్నారు.
chandrababu: దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఏపీ మారింది: చంద్రబాబు
నేను అధికారంలో ఉన్నప్పుడు పోలవరం విషయంలో లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు. పోలవరం బాధ్యతను వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవస్ధలను, పోలవరాన్ని నాశనం చేసింది తెలంగాణ వాళ్లా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీ డ్రామాలు కట్టిపెట్టండి, ప్రజలకు అన్ని విషయాలు అర్ధమవుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం చేతకాని తనంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు వాపోయారు.