Chandrababu House Attachment : చంద్రబాబు ఇంటి జప్తుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు దగ్గర చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేశ్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. నాలుగు రోజుల క్రితం దాఖలైన ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది విజయవాడ ఏసీబీ కోర్టు. తీర్పుని రిజర్వ్ చేసింది. తీర్పు రానున్న నేపథ్యంలో చంద్రబాబు ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..YS Viveka case: ఆ సత్తా టీడీపీకి ఉంది.. వెన్నతో పెట్టిన విద్య: సజ్జల రామకృష్ణారెడ్డి
లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. లింగమనేని తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేశారు. సీఆర్డీఏ, మాస్టర్ ప్లాన్ లో ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని.. ఇందులో భారీ మొత్తంలో లింగమనేని రమేశ్ కు చంద్రబాబు నాయుడు లబ్ది చేకూర్చే విధంగా వ్యవహరించారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది.
ప్రతిఫలంగా లింగమనేని రమేశ్ తన గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకి గిఫ్ట్ ఇచ్చారని ఆరోపణలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించారంది. అయితే, ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని, చంద్రబాబు కేవలం అద్దెకు ఉంటున్నారని లింగమనేని రమేశ్ న్యాయవాది చెప్పారు. ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఏమని తీర్పు ఇవ్వనుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చంద్రబాబు నివాసం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. లింగమనేనికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏ విధంగా ముందుకెళ్లాలని టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా చంద్రబాబు నివాసం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు నివాసం జప్తునకు సంబంధించిన పిటిషన్ పై 4 గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పు లింగమనేనికి అనుకూలంగా వస్తుందా? లేక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.