Cm Chandrababu: 2004లో అందుకే ఓడిపోయాం, మళ్లీ మేము వచ్చాకే ఏపీలో అభివృద్ధి- సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు అనేకమందిని కలిశా. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ను కలిశా. హైదరాబాద్ కు అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాం.

  • Published On : March 22, 2026 / 07:54 PM IST
  • 1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశాం
  • నా కృషి వల్లే జినోమ్ వ్యాలీ వచ్చింది
  • 30 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించా
  • మళ్లీ మేము అధికారంలోకి వచ్చాక ఏపీలో అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నాం
  • ఇప్పుడు అనేక రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది

Cm Chandrababu: 2004లో టీడీపీ ఓటమిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేము అని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో (ఐఎస్ బీ) సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026 లో చంద్రబాబు పాల్గొన్నారు. పలు అంశాలపై మాట్లాడారు.

1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశామని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని చంద్రబాబు చెప్పారు. ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని తెలిపారు.

గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ లో కృతిమ మేధ వినియోగం, విస్తరణ లక్ష్యంగా చర్చలు జరిపారు. ఏఐ సంబంధిత అంశాలు, డేటా భద్రత, పాలసీలపైనా డిస్కస్ చేశారు.

ఐటీ కంపెనీలు తెచ్చేందుకు అనేకమందిని కలిశా…

”1990 దాటాక ఇంటర్నెట్ వచ్చింది. దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీ ఉండేది. 1995 నుంచి నాలెడ్జ్ ఎకానమీ మొదలైంది. ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు అనేకమందిని కలిశా. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ను కలిశా. హైదరాబాద్ కు అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాం. హైదరాబాద్ కు నల్సార్, ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాం. అప్పట్లో కేవలం మంజీరా నుంచే తాగునీరు వచ్చేది. కేవలం 9 నెలల్లోనే కృష్ణా నది నుంచి తాగునీరు తీసుకొచ్చాం.

1999-2004 మధ్య హైదరాబాద్ ను శర వేగంగా అభివృద్ధి చేశాం. అప్పట్లో నా కృషి వల్లే జీనోమ్ వ్యాలీ వచ్చింది. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయాం. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మాకు పదేళ్లు పట్టింది. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేము.

2019 నుంచి 2024 మధ్య ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. 2024లో ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నాం. ఇప్పుడు అనేక రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. 30 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించా. ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్ టెక్నాలజీ వచ్చాయి. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీని ఎలా వాడుతున్నారో చూస్తున్నాం.

విద్యుత్ సమస్యలను అధిగమించి మిగులు వరకు తీసుకొచ్చాం. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో ఏపీ నెంబర్ వన్ గా ఉంది” అని చంద్రబాబు అన్నారు.

Also Read: జనసేన ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12లక్షలు మాయం.. చలానా పేరుతో ఫోన్‌కు లింక్ రాగానే..